ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో సగటున ఒక్కొక్కరూ ఏడాదికి 58 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) తెలిపింది.
యూఎన్ఈపీ ఈ ఏడాది మార్చిలో ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2021’ ప్రచురించింది. రాజాంలో 2016లో నిర్వహించిన ఒక అధ్యయనం వివరాలను ఈ రిపోర్టులో పేర్కొంది. రాజాంతో పాటు డెహ్రడూన్లో కూడా ఒక అధ్యయనం జరిపారు. అక్కడ 2014లో సగటున 73 కేజీల ఆహారం వృధా కాగా, 2015 నాటికి ఆహార వృధా 20 కేజీలకు తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలింది. భారతదేశంలో సగటున ప్రతి ఏటా ఒక్కొక్కరూ 50 కేజీల చొప్పున ఆహారాన్ని వృధా చేస్తున్నారని, దీని ప్రకారం దేశ ప్రజలంతా కలిపి ఏడాదికి 68,760,163 టన్నుల ఆహారాన్ని వృధా చేస్తున్నారని లెక్కకట్టింది.
మనం ఇళ్లల్లో వండుకునే ఆహారం వృధా కావడం ఒకవైపు, కొనుక్కునే ఆహరపదార్థాలు వృధా కావడం మరోవైపు. వండిన ఆహారాన్ని ఆరోజు లేదా మర్నాటి వరకూ తింటాం. పాకెట్లలో దొరికే ఆహారం అయితే, వాటిపై ఉండే ఎక్స్పైరీ డేట్ లోపల వినియోగిస్తాం. ఆ తేదీ దాటిపోతే పారేస్తాం. ముఖ్యంగా బ్రెడ్, కూరగాయలు, చీజ్, జామ్ లాంటివి ఎక్స్పైరీ డేట్ దాటిపోయిందని పారేస్తూ ఉంటాం. సూపర్ మార్కెట్లు పెరిగిపోతున్న ఈ కాలంలో పట్టణ, నగర ప్రాంతాల్లో చాలావరకు నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ప్యాకెట్లలోనే లభిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో, ఎక్స్పైరీ డేట్ దాటిన తరువాత కూడా తినగలిగే పదార్థాలు ఏమైనా ఉన్నాయా? అలా చేయగలిగితే కొంతవరకైనా ఆహారం వృధా కాకుండా నివారించగలమా?
ఆహార పదార్థాలను అమ్మే ప్యాకెట్లపై రకరకాల లేబుల్స్ ఉంటాయి. వాటిని గమనిస్తే లోపల ఉన్న పదార్థం ఎంతవరకు నిల్వ ఉంటుందో మనకు తెలుస్తుంది. ఒక్కో లేబుల్ ఒక్కో విషయాన్ని తెలుపుతుంది. అయితే, అన్ని ఆహార పదార్థాలకు ‘యూజ్ బై’ తేదీ ఉండకపోవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయల ప్యాకెట్లపై ఈ తేదీ ఉండదు. మరి వీటిని ఎంతకాలం వరకు తినవచ్చు? ‘బెస్ట్ బిఫోర్’ తేదీ దాటిన తరువాత కూడా తినొచ్చా? ఇది తెలుసుకోవడానికి మేం ఒక చిన్న ప్రయోగం చేశాం. కొన్ని ఆహార పదార్థాలను బెస్ట్ బిఫోర్ తేదీ దాటిన తరువాత కూడా ఒక వారం పాటు వెచ్చని ఉష్ణగ్రతల వద్ద నిల్వ ఉంచాం. ఆ తరువాత, వాటిని డాక్టర్ పాట్రిక్ హిక్కీ పరిశీలించారు. పాట్రిక్ హిక్కీ ఆహారపదార్థాలపై వ్యాపించే బ్యాక్టీరియా, బూజు నిపుణులు.