ఫేస్బుక్కు సంబంధించిన వెబ్సైట్లు, యాప్లు పిల్లలకు హాని కలిగించడంతో పాటు విభేదాలకు కారణమవుతాయని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని అమెరికా చట్టసభ సభ్యులతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పారు.
మాజీ ప్రాడక్టు మేనేజర్ అయిన 37 ఏళ్ల ఫ్రాన్సెస్ హౌజెన్, క్యాపిటల్ హిల్లో జరిగిన విచారణలో ఫేస్బుక్ కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కంపెనీ నియమనిబంధనలపై లోతైన పరిశీలన జరపాలనే డిమాండ్లు ఫేస్బుక్ యాజమాన్యానికి ఎదురయ్యాయి. ఈ విమర్శలను ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఖండించారు. కంపెనీ గురించి అసత్య ప్రచారాలు జరిగాయని అన్నారు.
”కంపెనీపై వచ్చిన చాలా ఆరోపణలు, అర్థం లేనివని” తన ఉద్యోగులకు రాసిన లేఖలో జుకర్బర్గ్ పేర్కొన్నారు. హానికరమైన కంటెంట్పై పోరాటం, పారదర్శకంగా పనిచేయడం ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో మనం చేస్తోన్న ప్రయత్నాల పరంగా చూసుకుంటే ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు అని ఆయన అన్నారు. ”భద్రత, మానసిక ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సుపై ఫేస్బుక్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మన పనిని, మన ఉద్దేశాలను తప్పుగా చూపించే ప్రచారం జరగడాన్ని చూడటం కష్టంగా ఉంది” అని ఫేస్బుక్ పేజీలో బహిరంగ లేఖ రాశారు.
ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమం ఫేస్బుక్. తమకు నెలవారీ యాక్టివ్ యూజర్లు 270 కోట్ల మంది ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా తమ అనుబంధ ఉత్పత్తులైన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను కూడా కోట్ల మంది వినియోగిస్తారని చెప్పింది. వినియోగదారుల గోప్యతను కాపాడటంలో విఫలమవ్వడం, తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాల వల్ల ఫేస్బుక్ అనేక విమర్శలను ఎదుర్కొంది.
ఫేస్బుక్కు సంబంధించిన అనేక అంతర్గత పత్రాలను తాను ఇటీవలే వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చినట్లు హౌజెన్ ఆదివారం సీబీఎస్ న్యూస్తో చెప్పారు. ఆ పత్రాల ఆధారంగా చేసిన అధ్యయనంలో ఇన్స్టాగ్రామ్, అమ్మాయిల మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వెల్లడైనట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మంగళవారం చట్టసభల ముందు సాక్ష్యం చెప్పేందుకు హాజరైన హౌజెన్ ఇదే అంశంపై మాట్లాడారు. ”ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లను మరింత సురక్షితంగా ఎలా చేయాలో ఫేస్బుక్ సంస్థకు తెలుసు. కానీ వారు అందుకు అవసరమైన చర్యలేమీ తీసుకోరు. ఎందుకంటే వినియోగదారుల భద్రత కన్నా ఆర్థిక ప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యతనిస్తారు” అని వివరించారు.